NewsTelangana

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్..

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. రాంచీ నుంచి జంషేడ్‌పూర్ వరకు 163 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా ఆయనపై నమోదైన కేసులో ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్లించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలోనూ ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఆస్తుల జప్తులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని అటాచ్ చేసింది. అలాగే హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్థులను కూడా ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పేరుతో రుణాలు తీసుకుని, వాటిని దారి మళ్లించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం రూ.361.29 కోట్లు నేరుగా దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. నామా నాగేశ్వర రావుతోపాటు, నామా సీతయ్య అధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.