Home Page SliderTelangana

పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి డిసెంబర్ 19న విచారణ నిమిత్తం ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్‌ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు అందజేసింది. నోటీసులపై రోహిత్ రెడ్డి స్పందిస్తూ.. డిసెంబర్ 19న ఈడీ ఎదుట హాజరవుతానని, కేంద్ర ఏజెన్సీ నోటీసులోని అంశాలకు సమాధానం ఇస్తానన్నారు. కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న అక్రమాస్తుల కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని స్థానిక కోర్టు నమోదు చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ నోటీసును రోహిత్ రెడ్డి అందుకున్నారు. రోహిత్ రెడ్డి ఇద్దరు వ్యాపారవేత్తలు కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డితో కలిసి బెంగళూరులో తన స్నేహితుల కోసం నిర్మాత శంకర గౌడ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు, ఇందులో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీలోకి ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను గౌడ ఆహ్వానించారు. గతంలో డ్రగ్స్ కేసులో బెంగళూరులో ఓ ప్రముఖుడిని గోవిందపురా పోలీసులు అరెస్ట్ చేయగా.. ల్యాండ్ డీలింగ్ కోసం రోహిత్ రెడ్డి పార్టీకి హాజరయ్యారనే ఆరోపణలు వచ్చాయి.