రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ నుంచి 5.24 కోట్ల రూపాయలు అదే నియోజక వర్గంలోని 23 మందికి, కంపెనీలకు బదిలీ అయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 14, 18, 29 తేదీల్లో రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ చేసిన ఫిర్యాదును ఈసీ ప్రస్తావించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఈ డబ్బును వినియోగించారని టీఆర్ఎస్ ఆరోపించింది. అదే నిజమైతే ఇది అవినీతి చర్యల కిందకు వస్తుందని ఈసీ తెలిపింది. బదిలీ చేసిన ఆ డబ్బు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత రాజగోపాల్ రెడ్డిదేనని ఈసీ స్పష్టం చేసింది.