లోన్ యాప్ వేధింపులకు ఎంసెట్ ర్యాంకర్ బలి
లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలయ్యారు. ఈసారి లోన్ యాప్ నిర్వాహకులు ఏకంగా ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు తీశారు. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 2 వేల ర్యాంకు సాధించిన మణిసాయి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్-పద్మ దంపతుల కుమారుడైన మణిసాయి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత 6 నెలలుగా రూ. 45 వేలు కట్టినా.. ఇంకా డబ్బులు కట్టాలంటూ వేధించసాగారు. దీంతో ఈ నెల 20వ తేదీన శంషాబాద్లోని తన రూమ్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్నేహితులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచాడు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా వెబ్ కౌన్సెలింగ్కు వెళ్లాల్సి ఉన్న తన కుమారుడి ప్రాణాలు దక్కించుకోలేకపోయామని మణిసాయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

