మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్పై డ్రోన్ షికార్లు
తాడేపల్లి: గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేసి లోపల ఉన్నవారి కదలికలు, పరిసరాలను చిత్రీకరించారని ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి 9.45, 11.15, అర్ధరాత్రి 12 గంటల సమయంలో డ్రోన్ చక్కర్లు కొట్టిందని, తిరిగి ఈ నెల 16న రాత్రి 9.30, అర్ధరాత్రి 12.30, 17వ తేదీ తెల్లవారు జామున 4.30, ఉదయం 9 గంటల సమయంలో డ్రోన్ ఎగరడాన్ని సిబ్బంది గుర్తించారని.. ఈ సమయాల్లో పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఆఫీస్లోనే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల పవన్ భద్రతకు, వచ్చే సందర్శకులకు ముప్పు పొంచి ఉందని.. సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ మల్లికార్జునరావుకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. డ్రోన్లను పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

