కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దు..
కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ వీసీ సజ్జనార్ సూచించారు. బెట్టింగ్ యాప్ లో ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. “రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారు. బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్వలాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం? కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థమని యువత గుర్తించాలి. స్వార్థ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండండి” అని సజ్జనార్ పేర్కొన్నారు.

