లవర్ కోసం భర్తను ఏం చేసిందో తెలుసా?
ఉత్తర్ప్రదేశ్ మీరఠ్ ఘటన మరువకముందే అక్కడ మరో ఘాతుకం వెలుగు చూసింది. పెళ్లైన రెండు వారాలకే ప్రియుడి సాయంతో భర్తను చంపించింది ఓ భార్య. ఇందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్ను రూ. 2లక్షలకు నియమించుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను పట్టుకున్నారు.ఈ నెల 5న ఔరోయాకు చెందిన దిలీప్, ప్రగతిని వివాహమాడాడు. అయితే అప్పటికే ప్రగతి తన గ్రామంలోని మనోజ్ యాదవ్తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉందని ఎస్పీ తెలిపారు. పెళ్లాయ్యాక కలుసుకోవడానికి వీలులేకపోవడంతో దిలీప్ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి వ్యూహ రచన చేసిందని చెప్పారు. కాంట్రాక్ట్ కిల్లర్ రామ్జీతో కుదుర్చుకున్న రూ.2 లక్షలు ఒప్పందంలో లక్ష రూపాయలను ప్రగతినే సమకూర్చిందని చెప్పారు. ఇందుకోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన నగలు, కానుకలు విక్రయించిందని తెలిపారు. ఈనెల 19న బాధితుడికి మాయ మాటలు చెప్పి నిందితులు పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి, తుపాకితో కాల్చారని వెల్లడించారు. అనంతరం చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. గాయాలతో ఉన్న దిలీప్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.