గవర్నర్తో విభేదాలు, రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ దూరం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తనను ఖాతరు చేయడంలేదంటూ గవర్నర్ తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా హైదరాబాద్లోని రాజ్భవన్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ హాజరుకాకపోవడంతో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర పోరు ఉధృతమయ్యేలా కన్పిస్తోంది. రాజ్ భవన్లో జరిగిన వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదు. కోవిడ్ను ఉటంకిస్తూ వరుసగా రెండో సంవత్సరం ప్రభుత్వం పరేడ్ను రద్దు చేసింది. రాజ్భవన్లో ఓ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా… దానిని తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలను సెరిమోనియల్ పరేడ్తో నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరించింది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పరాదని కోర్టు సూచించింది. అయితే వేదిక ఎంపికను రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. మరోవైపు సీఎం కేసీఆర్ తన నివాసం ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
