రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
యోగా గురువు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో అల్లోపతి ఔషధాలు, చిక్సిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై జస్టిస్ అనుప్ జె. భంభానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలతో ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరును పాడు చేయవద్దని సూచించింది.
కరోనిల్ కోవిడ్పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రాం దేవ్ బాబాకు ధర్మాసనం చురకలు అంటించింది. `ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయని ఈ విషయాన్ని గ్రహించకపోతే ఎలా? అంటూ చీవాట్లు పెట్టింది.
ఇదిలా ఉండగా.. పతాంజలి కరోనిల్ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధృవీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రాందేవ్ బాబా సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్ర రూపం దాల్చిన క్రమంలో కరోనిల్పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.

