ఇంటర్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే సహించమన్న సీఎస్
ప్రస్తుతం జరుగుతున్నఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్ , టెన్త్ పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ రవీ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎస్.ఏ.ఎం.రిజ్వి, నదీమ్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడే ఏవిధమైన చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షా పేపర్ లీకేజీకై ప్రయత్నించిన పలువురు అధ్యాపకులు, సిబ్బందిని గుర్తించి వారిని అరెస్టు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
