Home Page SliderNational

7 వేలకు చేరువలో కరోనా కేసులు..68కి పెరిగిన మరణాల సంఖ్య

దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 324 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది. అత్యధికంగా ఒక్కరోజే కర్ణాటకలో 136 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత గుజరాత్‌లో 129 కేసులు వెలుగు చూశాయి. కేరళలో 96 మందికి పాజిటిగా తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేరళలో అత్యధికంగా 2053 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1,109 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 747 కేసులు, ఢిల్లీలో 691, కర్ణాటకలో 559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,815కి పెరిగింది. గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి. ఢిల్లీ, జార్ఖంఢ్‌, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 68కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ నుంచి 7644 మంది కోలుకున్నారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేసేందుకు కేంద్రం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది. అన్ని దవాఖానాలలో ఆక్సిజన్‌, ఐసోలేషన్‌ బెడ్స్‌, వెంటిలేటర్లు, ఇతరఅత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్స్‌ ఎన్‌బీ1.8.1 కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం డేటా ప్రకారం.. దేశంలో ఈ వేరింట్‌ కేసులు 163 రికార్డయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు (16), కేరళ (15), గుజరాత్ (11), ఆంధ్రప్రదేశ్ (6), మధ్యప్రదేశ్ (6), పశ్చిమ బెంగాల్ (6) కేసులు వెలుగు చూశాయి.