బీసీల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం-మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీలకు విద్య, ఉపాధి అవకాశాల్లో కల్పనలో కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ పనితీరుని, ప్రస్తుతం ఉన్న గురుకుల విద్యాలయాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు , ఆత్మగౌరభవనాలు, ఫెడరేషన్లకు సంబంధించిన అనేక విషయాలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. సంక్షేమాన్ని ప్రజలకు అందించటం ఒక అదృష్టం గా భావించి అధికారులందరూ బీసీల సామగ్రాభివృద్ధి కోసం, నిరుపేదలైన బీసీ ప్రజల సంక్షేమo , వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసం నిబద్దతతో పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. బిసి సంక్షేమ శాఖలోని హాస్టల్లో విద్యార్థుల సంఖ్య , అవసరమైన నిధులు , వసతుల గురించి, రాష్ట్రం లోని స్టడీ సర్కిల్స్లో ఇస్తున్న కోచింగ్ గురించి ఈ సమావేశంలో సమీక్షించారు. గురుకుల పాఠశాలల పనితీరు, విద్యార్థులు సాధిస్తున్న ఉత్తీర్ణత శాతం గురించి మంత్రి సమీక్షించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఐఏఎస్ గారు,అడిషనల్ సెక్రెటరీ పద్మ, ఎంబీసీ సీఈఓ అలోక్ కుమార్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు, చంద్రశేఖర్, సంధ్య, విమల, శ్రీనివాస్ రెడ్డి , మద్దిలేటి, మంజుల, ఉదయ్ ప్రకాష్, తిరుపతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

