సభకు రండి.. కుర్చీ పట్టుకెళ్లండి.. బంపరాఫర్..
తమిళనాడులోని విపక్ష పార్టీ అన్నాడీఎంకే సభకు జనాన్ని ఆకర్షించేందుకు వినూత్నమైన ఆలోచన చేసింది. సభకు వస్తే కుర్చీ ఫ్రీ అని బంపరాఫర్ ప్రకటించింది. సభకు వచ్చిన వాళ్లు, సభ ముగిశాక కుర్చీ తీసుకెళ్లిపోవచ్చని వెల్లడించింది. తిరుపూర్ పెరుమానల్లూర్ లో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జనసమీకరణ బాధ్యతను అన్నాడీఎంకే అధిష్టానం స్థానిక నేతలకు అప్పగించింది. దాంతో, వారు ఈ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని… “సభకు రండి, కుర్చీ పట్టుకెళ్లండి” అంటూ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు 1,500 కుర్చీలను ఏర్పాటు చేశారు. దాంతో ఈ సమావేశానికి జనాలు భారీగా తరలివచ్చారు. సభకు హాజరై, ఎంచక్కా కుర్చీలను ఇంటికి పట్టుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

