Andhra PradeshHome Page Slider

ఈ–ఆటోలను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్‌

రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది సీఎం జగన్‌ ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) నేడు ఉదయం సీఎం జ‌గ‌న్ జెండా ఊపి ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముందుగా దివంగ‌తనేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి సీఎం జ‌గ‌న్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

అనంత‌రం జెండా ఊపి ఆటోల‌ను ప్రారంభించారు. ఆటోల నిర్వాహ‌ణ‌పై డ్రైవ‌ర్ల‌ను, అధికారుల‌ను అడిగి సీఎం జ‌గ‌న్ వివ‌రాలు తెలుసుకున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ –ఆటోలు ప్రవేశపెడుతున్నారు.