అనారోగ్య బాధితులకు సీఎం తక్షణం సహాయం
ఎలమంచిలిలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని.. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి. ఎలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న వాణి అమ్మమ్మ, తక్షణ సహాయానికి సీఎం హామినిచ్చారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఎస్ రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పనిచేయకపోవడంతో వీల్ఛైర్కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న శివాజి కుటుంబ సభ్యులు. తక్షణ సహాయానికి సీఎం హామినిచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. ప్రాణం ఉన్నంత వరకు ఆయననే దీవిస్తామన్నారు. సీఎం జగన్కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.


