Home Page SliderTelangana

రేపు ఢిల్లీకి సీఎం.. క్యాబినెట్ విస్తరణపై చర్చ

రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చాలాకాలంగా వాయిదా పడుతున్న రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ కొలిక్కి వస్తుందని సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలను హైకమాండ్ తో చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇదే విషయమై అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లినా కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు ముందే క్యాబినెట్ ను విస్తరించాలని అనుకున్నారు. అయితే, హైకమాండ్ పెద్దలు ఆ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో క్యాబినెట్ విస్తరణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ అంశంపై చర్చించి జాబితాతో తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.