Andhra PradeshHome Page Slider

రైతులకు నేడు లక్ష రుణమాఫీ, మాట నిలబెట్టుకున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి

గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి నిరూపణ అయిందన్నారు. నాడు కరీంనగర్ లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసని మాట ఇచ్చారు. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా  మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా రాష్ట్రాన్ని  ఇచ్చారన్నారు రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారన్న రేవంత్, మొదటి ఐదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రెండో సారి ప్రభుత్వంలో 12 వేల కోట్లని,  కేవలం 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. పదేళ్లలో 21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదన్నారు. మే 6, 2022 న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించామన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 20023లో తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారన్నారు. రెండు లక్షల రుణమాఫీ  చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారన్న రేవంత్, సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు 6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులకు రైతాంగం తరుపున ధన్యవాదాలు చెప్పారు రేవంత్.

నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది… రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్ గా పెట్టుకున్నామన్నారు. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. లక్ష లోపు రుణం ఉన్న రైతులకు ఈ రోజు రుణ విముక్తి కల్పించామన్నారు. లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు  త్వరలోనే రుణ విముక్తి కలుగుతుందన్నారు. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారన్న రేవంత్, రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదన్నారు. రుణమాఫీకి పాస్ బుక్ నే కొలబద్ద తప్ప రేషన్ కార్డు కాదన్నారు. దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మోద్దన్నారు. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్యలు వస్తే బ్యాంకర్లను సంప్రదించాలన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్న రేవంత్, వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు అని, ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదన్న ఆయన, మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.  గత ప్రభుత్వం అప్పులకు మిత్తిగా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు.  రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుందన్నారు.  ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నామన్నారు. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం.. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలన్నారు.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు.  రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీని ఆహ్వానించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు.