Andhra PradeshHome Page Slider

సీఎం జ‌గ‌న్ విశాఖ పర్యటన, వరుస శంకుస్థాపనలు

వైయస్ఆర్ వీసీఏ స్టేడియంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహావిష్కరణ
అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం
సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియం ప్రారంభోత్సవం

సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, కొన్నింటిని ప్రారంభించారు. సీఎం జగన్ ముందుగా, పీఎం పాలెం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్టేడియానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైయస్‌ఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను ప‌రిచ‌యం చేసుకొని వారితో గ్రూప్ ఫొటో దిగారు.

అదే విధంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎల్‌ సీజన్‌–2ను ప్రారంభించారు. అండ‌ర్ – 19 మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన్న‌ మహిళా క్రికెటర్లు ష‌బ్నం, అంజిలిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించి ఘనంగా సత్కరించారు. వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. అనంత‌రం ఏపీఎల్ సీజ‌న్‌-2 రంజీ ప్లేయ‌ర్ల‌తో మాట్లాడి వారితో గ్రూప్ ఫొటో దిగారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, అధికారులు ఉన్నారు.

అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం

ఆ తర్వాత ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం రేడియేషన్‌ ఎక్విప్‌మెంట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడిన సీఎం.. వారితో గ్రూప్‌ ఫొటో దిగారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి బీచ్‌ రోడ్డుకు చేరుకున్నారు.

సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియం ప్రారంభోత్సవం

విశాఖలో వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హేర్రియర్ మ్యూజియం క్రొత్త ఎట్రాక్షన్ గా మారింది. 32 ఏళ్ల పాటు నేవీకి సేవలందించిన సీ హారియర్ యుద్ద విమానాన్ని సందర్శకుల కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో మ్యూజియంగా మార్చారు. దాన్ని ఈ రోజు సీఎం జగన్ చేతుల మీదగా ప్రారంభించారు. అనంతరం మ్యూజియం మొత్తం తిరిగి యుద్ద విమాన విశేషాలు తెలుసుకున్నారు.

వరుస శంకుస్థాపనలు

రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్ధాపన చేస్తారు. అక్కడి నుంచి ఒక వివాహ కార్యక్రమానికి బయల్దేరుతారు.