Andhra PradeshHome Page Slider

ఇకపై పల్లెలలో కూడా 4జీ సేవలు – జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ఒకేసారి 100 జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయని వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లను  ఈ విధానంలో సీఎం ప్రారంభించారు.

టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్‌ జియో సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయబోతోందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్‌ ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ చేయాలని సంకల్పించింది.

రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకు సహకారించిన కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగానికి, జీయోకు, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్‌, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఎస్‌ఆర్‌ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు.