పోల’వరం’ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పోలవరం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రిని కలిసిన తర్వాతే నిధులకు సంబంధించి నిర్ణయాలు వేగవంతమైయ్యాయని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల కారణంగానే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్యలు వేగవంతం అవుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు రూ.17,144 కోట్ల నిధుల విడుదలకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుపై భౌతిక, ఆర్థిక పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించేందుకు ఆరు అంశాలతో అజెండా రూపొందించారు. సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సహ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అడహాక్ నిధుల కింద రూ. 17,414 కోట్ల విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పరిశీలిస్తామని జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటీవల సీఎం జగన్ – జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను కలిసిన తర్వాతే నిధులకు సంబంధించిన నిర్ణయాలు వేగవంతమయ్యాయని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.