CAG రిపోర్ట్: కాళేశ్వరంపై షాకింగ్ నిజాలు
కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని ఇప్పటి వరకు మేడిగడ్డలో నాసిరకం నిర్మాణాల ద్వారా వింటా.. తాజాగా, ప్రాజెక్టు లొసుగులను కాగ్ రిపోర్ట్ తూర్పారబట్టింది. ప్రాజెక్టు ఆమోదం దగ్గర్నుంచి, నిర్మాణం వరకు అంతా తప్పులతడకేనని, ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు నిర్మించారని, చెప్పిందేదీ చేయలేదని, నిధుల కోసం ఇష్టారాజ్యంగా డిజైన్ మార్చుకుంటూ వచ్చారని, అసలు కంటే కొసరు ఎక్కువన్నట్టుగా ప్రాజెక్టుకు నిధులు నీళ్లలా ఖర్చు చేశారని విమర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విద్యుత్ చార్జీలే ఏటా పది వేల కోట్లవుతాయని, ప్రాజెక్టు నిర్వహణకు మరో 10 వేల కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని.. ఇదంతా ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శమని కాగ్ రిపోర్ట్ లో వెల్లడించింది.

కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పబట్టింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగిందని, కానీ ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని విమర్శించింది. ప్రాజెక్టు డీపీఆర్కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని… ప్రాజెక్ట్ వ్యయం రూ.63వేల352 కోట్ల నుంచి రూ.లక్షా 2వేల 267 కోట్లు పెరిగిందని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని, ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ పేర్కొంది. అదనంగా నిర్వాహణ ఖర్చు రూ.272 కోట్లని, ప్రాజెక్టు నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు అంటూ రిపోర్ట్ లో వివరించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లని, ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదని ఆరోపించింది విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని తెలిపింది. 2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో, ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు లేవు కాగ్ వివరించింది. ప్రాజెక్ట్ నిధులు సమకూర్చుకోవడం కోసం KICCLఏర్పాటు చేశారని… ప్రభుత్వం ఇచ్చిన హామీలతో KICCL ద్వారా రూ.87,449 కోట్ల రుణాలు సమీకరించారని పేర్కొంది. KICCL రుణాలపై ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదంది. ప్రాజెక్ట్ నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వెర్డికల్ ఫాల్ట్ ఉందని ఎన్జీఆర్ఐ ఆధ్యయంలో పేర్కొంది. భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని, 50టీఎంసీల సామర్ధ్యంతో రూ.6వేల126 కోట్లతో మల్లన్న సాగర్ నిర్మించారంది కాగ్. అంతరాష్ట్ర సమస్యలు..నిల్వ సామర్థ్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ నిప్పులు చెరిగింది. కాళేశ్వరం DPR తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయంది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందంది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు ఉపయోగం లేకుండా పోయాయంది.

రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందంది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ అభిప్రాయపడింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారంది. డీపీఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్ట్ పనుల్లో మార్పులు చేశారని కాగ్ ఆరోపించింది. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని, అదనపు టీఎంసీ వల్ల రూ.25వేల కోట్ల అదనపు వ్యయమయ్యిందంది. కాళేశ్వరం 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయని, కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టమని కాగ్ పేర్కొంది. కాళేశ్వరం ప్రభావం బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని తెలిపింది.