పంచాయతీలకు భవనాలు.. రైతులకు నీళ్లు..
మునుగోడు ఉప ఎన్నిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ప్రభుత్వానికి గ్రామాల్లోని పంచాయతీలు, రైతుల సంక్షేమం గుర్తుకొచ్చాయి. ఎనిమిదేళ్లుగా పట్టించుకోని గ్రామాల్లోని పంచాయతీలకు త్వరలో కొత్త భవనాలు నిర్మిస్తామని, పంపుహౌస్లలో సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించి ఖరీఫ్ సీజన్లో రైతులకు నీళ్లు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

కొత్తగా ఏర్పడిన లంబాడీ తండాలు, ఏజెన్సీ గూడాల్లో కొత్త భవనాలు నిర్మిస్తామని, సొంత భవనాలు లేని పాత గ్రామ పంచాయతీల్లోనూ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. 4,745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించిన మంత్రులు.. నిధులు, విధి విధానాలు, ప్రణాళికలపై అధికారులతో చర్చలు జరిపారు.

మరోవైపు గోదావరి వరద వల్ల ముంపునకు గురైన పంప్హౌస్ల్లో సమస్యలను త్వరలో పరిష్కరించి రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లోనే నీళ్లు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు.