బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం..
ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి, ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా? ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్ లైన్ లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమే కదా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సంస్థ పరిరక్షణ కోసం ఎంత వరకైనా పోరాడతాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.