Home Page SliderTelangana

పరీక్ష పేపర్ల లీకేజీపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

కేసీఆర్ తక్షణం రాజీనామా చేయాలి!
ఆత్మహత్యలొద్దు.. విద్యార్థులకు ఈటల భరోసా
విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం
విద్యార్థులకు లక్ష పరిహారం ఇవ్వాలన్న ఈటల

TSPSC లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. TSPSC ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చేసి.. విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలన్నారు. TSPSC పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఈటల నేతృత్వంలో బీజేపీ నేతలు, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది.

పరీక్ష పేపర్ల లీకేజీ ద్వారా కేసీఆర్ విద్యార్థుల కళ్లలో మట్టి కొట్టారన్నారు. ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని… పరీక్ష రద్దు చేస్తున్నామని చెప్పి కేసీఆర్ ఎందుకు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు ఈటల. కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప, తెలంగాణ ప్రజల పట్టింపు లేకుండాపోయిందన్నారు. అభ్యర్థులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలని… ప్రభుత్వ మెడలు వంచుతామని నిరుద్యోగులకు ఈటల భరోసా ఇచ్చారు. పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్‌ని కోరామన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్న ఈటల, కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీ పైనే ఉందన్నారు. పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే TSPSC ఏం చేస్తుందని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయవన్నారు.