నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ నుమాయిష్ లో నిన్న సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ లో ఓ అమ్యూజిమెంట్ రైడ్ ఎక్కిన సందర్శకులు ప్రాణభయంతో వణికిపోయారు. రైడ్ జరుగుతుండగా ఒక్కసారిగా అది నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్నవారు దాదాపు అరగంటపాటు తలకిందులుగా ఉండిపోయారు. భయంతో కేకలు వేశారు. దీంతో ఏం జరిగిందో తెలియక గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సిబ్బంది చాలా సేపు శ్రమించి సమస్యను పరిష్కరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.