ముథోల్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఐదో విడత పాదయాత్రను ప్రారంభించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ముథోల్లో పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. పాదయాత్ర ప్రారంభ సభను భైంసాలో నిర్వహిస్తామని.. కరీంనగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోనని సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఆయన ముందస్తుకు వెళ్లనని అంటే ముందస్తుకు వెళ్తారన్న మాట అని బీజేపీ నేతలు అంటున్నారు. నిర్మల్లో లక్ష ఓట్లే లక్ష్యంగా పని చేస్తున్నామని బండి సంజయ్ చెప్పారు.

