ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పాఠశాల నడిచే సమయంలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో మునిగిపోతున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.