NationalNews

పీఎఫ్‌ఐపై మళ్లీ దాడులు.. 60 మంది అరెస్టు

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు మంగళవారం తెల్లవారుజామున మళ్లీ దాడులు నిర్వహించాయి. 15 రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో 60 మందిని అరెస్టు చేశారు. ఏటీఎస్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కర్నాటకలోని భగల్‌కోట్‌లో 45 మంది, అసోంలో ఏడుగురు పీఎఫ్‌ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఔరంగాబాద్‌, నాందేడ్‌, షోలాపూర్‌, జాల్నా, పర్భానీలలో కూడా పీఎఫ్‌ఐ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ముంబ్రాలో ఇద్దరిని, కళ్యాణ్‌లో ఒకరిని, భివాండీలో ఒకరిని అరెస్టు చేశారు. ఈ నెల 12వ తేదీన తొలి విడతలో అరెస్టు చేసిన వారి నుంచి లభించిన ఆధారాలతో తాజా దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయని.. సాయంత్రానికి అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.