జేసీ ప్రభాకర్రెడ్డిపై అట్రాసిటీ కేసు
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ. అయితే, ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో, జేసీ ప్రభాకర్రెడ్డిపై పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

కాగా, గతంలోనూ జేసీ ప్రభాకర్రెడ్డిపై ఈ తరహా కేసులు ఉన్నాయి. కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పురు పోలీసులు గతంలోనూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధుల ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు. ఇది ఒకటే కాదు, తాడిపత్రిలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలోనూ జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరులపై కేసులు పెడుతూ వచ్చారు పోలీసులు. ఇదంతా ప్రతిపక్షాలను వేధించాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ కేసులు పెట్టిస్తుందని జేసీ బ్రదర్స్ ఆరోపిస్తున్న విషయం విదితమే.

