తెలుగు రాష్ట్రాల మధ్యన మరో వందేభారత్ రైలు మోదీ పచ్చజెండా
ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తున్న తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 8 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడువనున్న వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇది తెలుగు రాష్ట్రాలమధ్య రెండవ వందే భారత్ రైలు. మొదటి రైలు వైజాగ్ -సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.. తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కావడం, నిత్యం వెళ్లే భక్తులతో రైళ్లు కిటకిటలాడడం కారణంగా ఈ వందేభారత్ రైలు ప్రారంభం భక్తులకు శుభవార్త అనే చెప్పాలి. వేసవి సెలవలకు ముందే ఈ రైలు ప్రారంభం కాబోతోంది. . ఈ నెల 8 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాగ్యనగర వాసులకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కోరారు.

ఈరైలు గమ్యస్థానాన్ని చేరుకోవటానికి పట్టే సమయం కేవలం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగనుంది. ప్రారంభోత్సవం రోజున మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు.

అత్యధిక సామర్థ్యంతో, ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణ అనుభాతిని కలిగించేలా 400 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ప్రకటించిన భారతీయ రైల్వే, అధునాతనమైన కోచ్ లతో, వేగవంతమైన సేవలను, ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో ఈ రైళ్లను ప్రారంభించడం జరుగుతోంది. అత్యంత వేగంగా వేగాన్ని అందిపుచ్చుకోవడం, రాబోయే స్టేషన్ల సమాచార ప్రకటన, GPS వ్యవస్థతో కూడిన ప్రయాణికుల వివరాలు, ఆటోమేటిక్ గా తెరుచుకునే తలుపులు, ముడుచుకునే మెట్లు, బయో టాయిలెట్లు వంటి అధునాతన సదుపాయాలతో పాటు కవచ్ వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వందేభారత్ రైళ్లలో కల్పించడం జరిగింది.

