అమెరికా కాల్పుల్లో మరో హైదరాబాదీ విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మరో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త మరవక ముందే మరో హైదరాబాదీ యువకుడు కాల్పుల్లో మృతి చెందడం అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కొడుకు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.