Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsviral

అనిల్‌ అంబానీపై ఈడీ మరో కేసు

రిలయన్స్‌ గ్రూప్‌ అధిపతి అనిల్‌ అంబానీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌గా ఉన్న అనిల్‌ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో కొత్త కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతరుల పైనా కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఎస్‌బీఐ ఫిర్యాదు ప్రకారం.. పలు బ్యాంకులకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ రూ.40,000 కోట్లకు పైగా బకాయిపడింది. 2018 గణాంకాల ప్రకారం ఎస్‌బీఐ ఒక్కటే రూ.2,929 కోట్లు నష్టాన్ని చవిచూసింది.ఆర్‌కామ్‌కు అనుకూలంగా రుణాలు పొందేందుకు ఎస్‌బీఐను తప్పుదోవ పట్టించారు. అనంతరం ఆ రుణాలను దుర్వినియోగం చేసి అవకతవకలకు పాల్పడ్డారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ద్వారా ఆర్‌కామ్‌ బిల్లులను తక్కువగా చూపడం, అమ్మకాల ఇన్‌వాయిస్‌పై రుణాల దుర్వినియోగం వంటివి జరిగాయి’ అని సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ నష్టం కలిగించిందని ఆరోపిస్తూ.. ఇటీవల సీబీఐ రిలయన్స్‌ గ్రూప్‌ అధిపతి అనిల్‌ అంబానీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసు నేపథ్యంలో దర్యాప్తు సంస్థ ఆయన ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. ముంబయిలోని ఆర్‌కామ్‌ కార్యాలయం, అనిల్‌ అంబానీ ‘సీ విండ్‌’ ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడినందుకు అంబానీ, ఆర్‌కామ్‌పై సీబీఐ కేసు నమోదుచేసింది.