Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశం

కూకట్‌పల్లి పరిధిలోని ఐడీపీఎల్ భూముల కబ్జా వ్యవహారంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంటూ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పరిశ్రమల కోసం కేటాయించిన సుమారు రూ.4 వేల కోట్ల విలువైన భూములను నివాస ప్రాంతాల ముసుగులో ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్సీ కవిత మరియు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్య సాగిన పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ అక్రమాలు వెలుగులోకి రాగా, సర్వే నెం.376లో జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇండస్ట్రియల్ జోన్ అని తెలిసినప్పటికీ జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలకు చెందిన సుమారు 50 మందికి పైగా అధికారులు ప్రైవేటు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం.
ఈ పరిణామంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ తమ సంస్థ సాధించిన విజయమని పేర్కొన్నారు. ‘జనంబాట’ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటనలో ప్రజలు చేసిన ఫిర్యాదుల ఆధారంగానే తాను ఈ భూ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారుల విచారణను స్వాగతిస్తున్నామని, రాజకీయ కారణాలతో తమ కుటుంబంపై ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ఆరోపణలు ఈ విచారణతో తేలిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా విచారణను వేగంగా పూర్తి చేసి, అక్రమార్కుల నుంచి ఆ భూములను విడిపించి ప్రజలకు దక్కేలా చేయాలని కవిత డిమాండ్ చేశారు.