NewsTelangana

నేడు హైదరాబాద్‌కు అమిత్‌ షా.. ప్రభాస్‌తో భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్‌ రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించే తెలంగాణ విమోచన ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శనివారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్లనున్న అమిత్‌ షా 11 గంటల వరకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బేగంపేట టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీతో సమావేశమవుతారు.

ఫైల్‌ ఫొటో

ప్రభాస్‌తో భేటీ

పోలీస్‌ అకాడమీలో బస చేసే అమిత్‌ షా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో కూడా భేటీ అవుతారు. బీజేపీలో చాలా కాలం పనిచేసిన రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు.. ప్రభాస్‌కు పెదనాన్న. కృషం రాజు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని అమిత్‌ షా పరామర్శిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు జూనియర్‌ ఎన్టీయార్‌తోనూ అమిత్‌ షా భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌కు అమిత్‌ షా చేరుకుంటారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాలు అందజేస్తారు. సాయంత్రం మళ్లీ పోలీస్‌ అకాడమీకి వెళ్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు.