అంబటి రాంబాబు వాహనం ముట్టడి…
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగలు తారస్థాయికి చేరాయి. గుంటూరు జిల్లా గోరంట్లలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన శనివారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ పిలుపునిచ్చిన ‘పాప ప్రక్షాళన’ పూజల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో గోరంట్ల ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అంబటి వాహనం రాగానే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి కారు కదలకుండా ముట్టడించారు. ఈ క్రమంలో నిరసనకారులు కర్రలు, రాడ్లతో దాడికి ప్రయత్నించారని వైసీపీ ఆరోపించగా, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను అడ్డుకోవడమే కాకుండా చుట్టుముట్టిన కూటమి శ్రేణుల తీరుతో ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. సీఎంను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అల్లరి మూకలను అదుపు చేయలేకపోయారని, కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబును కావాలని తిట్టలేదని, తనను దుర్భాషలాడారు కాబట్టే ప్రతిస్పందనగా తిరిగి తిట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనపై కేసులు పెట్టినా, అరెస్టు చేసినా భయపడే వ్యక్తిని కాదని, కనీసం ముందస్తు బెయిల్ కూడా తీసుకోనని సవాల్ విసిరారు. అయితే, తన సమయం వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టనని, చంద్రబాబుపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మరోవైపు అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వం, కూటమి నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి అంబటి మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మంత్రి పార్థసారథి ఖండించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంగా వ్యవహరించాల్సిన మాజీ మంత్రి ఇలా వీధి రౌడీలా మాట్లాడటం శోచనీయమని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సైతం స్పందిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

