ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి ఓ మహిళ ఆత్మహత్య
భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా నాగలక్ష్మి అనే మహిళ ఆత్మ హత్య చేసుకుంది. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆన్ లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం అయింది. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఇటీవల తరచుగా ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. దీంతో క్షణికావేశంలో నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో విష పదార్థాలు ఆర్డర్ చేసుకున్న నాగలక్ష్మి ఆ విషం తాగేసింది. గురువారం ఉదయం నాగలక్ష్మి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. నాగలక్ష్మి తల్లితండ్రులు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.