వ్యక్తి చేసిన పాపం.. ఆ ఊరికి శాపం..
ఒక వ్యక్తి చేసిన నేరానికి ఆ ఊరంతా శిక్ష అనుభవిస్తోంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్, ఆమె అంగీకరించకపోవడంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ..స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ లో చోటు చేసుకుంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం హత్యా యత్నం అనంతరం జైనూర్ లో జరిగిన ఘటనల అమలైన 144 సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
దుకాణాలు తెరవకపోవడంతో ప్రజలు నిత్యావసరాలు, ఇతర పనులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 5న ఇరువర్గాలు సృష్టించిన విధ్వంసం అనంతరం పోలీసులు అమలు చేసిన 144 సెక్షన్ 22వ రోజుకు చేరింది. మండల కేంద్రంలోని మార్కెట్ ఇప్పటికీ తెరుచుకోవడం లేదు. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, కెరమెరి ఏజెన్సీ మండలాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రభుత్వ శాఖల ఆన్ లైన్ సేవలు స్తంభించిపోయాయి. జైనూర్ ఎస్బీఐ బ్యాంకులో లావాదేవీలు కొనసాగడం లేదు. క్రాఫ్ లోన్ తీసుకునే రైతులు రుణ సదుపాయానికి దూరమవుతున్నారు. జైనూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ సేవా కేంద్రాల బంద్ కారణంగా వివిధ సర్టిఫికెట్ల కోసం లబ్ది దారులు ఎదురు చూడక తప్పడంలేదు.

జైనూర్ సమీపంలోని లింగాపూర్, సిర్పూర్ యు మండలాల ప్రజలకు జైనూర్ మార్కెట్ ఆధారం కావడంతో నిత్యవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. 22 రోజులుగా వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరవకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్నూర్ మార్కెట్ కు ఆశ్రయించి వెళ్లాల్సి వస్తోంది. 144 సెక్షన్ సడలింపుతో మండల కేంద్రం నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న పశువుల సంత ఏర్పాటు చేసే చోట కూరగాయల మార్కెట్ కు అనుమతి ఇచ్చారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనుగోలుకు పోలీసులు అవకాశం కల్పించారు. అయితే కొద్ది సమయమే కావడంతో కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు మక్కువ చూపకపోవడంతో అక్కడ కూడా కూరగాయలు దొరకలేని పరిస్థితి ఏర్పడింది.

