నేటి నుండి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట కార్యక్రమం
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, సమస్యలు, విధ్వంసాలపై తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట అనే వినూత్న కార్యక్రమం తలపెట్టింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం ప్రజలతో చర్చించడం ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో ఈ కార్యక్రమం సాగనుంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు అంత దీనిలో భాగస్వాములవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు మూడు జిల్లాలలో రోడ్షోలు సభల్లో పాల్గొననున్నారు. మొదటిరోజు దెందులూరు, చింతలపూడి, రెండో రోజు పోలవరం, కొవ్వూరు, మూడో రోజు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జిలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో మొదలుపెట్టనున్నారు.