మరోసారి ప్రేక్షకుల ముందుకు హిట్ పెయిర్?
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి. అలాంటి వాటిలో ప్రభాస్-త్రిష జోడీ ఒకటి. వెండితెరపై హిట్ పెయిర్గా గుర్తుంపు తెచ్చుకుందీ జంట. వారిద్దరు కలిసి నటించిన ‘వర్షం’, ‘బుజ్జిగాడు’, ‘పౌర్ణమి’ చిత్రాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘వర్షం’ సినిమాలో ప్రభాస్, త్రిష మధ్య పండిన కెమిస్ట్రీని ఎప్పటికీ మరచిపోలేం. హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది త్వరలో. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో త్రిషను కథానాయికగా ఖరారు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది చివరలో ‘స్పిరిట్’ సెట్స్మీదకు వెళ్లనుందని సమాచారం. ఇదిలావుండగా ఇటీవలే త్రిష ‘బృంద’ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె అభినయానికి ప్రశంసలు పొందుతున్నారు.

