ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ప్రభుత్వాసుపత్రి
హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి, ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మలక్పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు బాలింతలు మృతి చెందారని వారి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన మహేశ్,తన భార్య సిరివెన్నెల గత కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే హైదరాబాద్లో మహేశ్ కారు డ్రైవరుగా పనిచేస్తున్నారు. కాగా ఆయన ఇటీవల తన భార్యను కాన్పు కోసం మలక్పేట ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా సిరివెన్నెల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఆమె మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాగా వారు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం జరగాలంటూ ఆసుపత్రి వద్ద బైఠాయించారు. మరోవైపు తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగదీశ్ తన భార్య శివాణిని కాన్పు కోసం మలక్పేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు కాన్పు చేయగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..శివాని కూడా మృతి చెందింది.

