గుండె మార్పిడి కోసం మెట్రో రైలులో హృదయం తరలింపు..
మెట్రో గ్రీన్ ఛానల్ గ్రాండ్ సక్సెస్ గా రన్ అవుతోంది. దీనిలో భాగంగా ఓ రోగికి గుండె మార్పిడి చేసేందుకు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రో రైలులో హృదయాన్ని శనివారం తరలించారు. గుండె భద్రపరిచిన బాక్సుతో బయల్దేరిన వైద్యులు నాగోల్ స్టేషన్లో రైలు ఎక్కి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద దిగి అక్కడి నుంచి అంబులెన్సులో గ్రీన్ఛానల్ ద్వారా అపోలో ఆసుపత్రికి చేర్చారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో గుండె వైఫల్యం చెంది మృత్యువుతో పోరాడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి ఈ గుండెను అమర్చారు. మెట్రో గ్రీన్ ఛానల్ లో భాగంగా గుండెను తరలించడం పట్ల నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.