పెళ్లి వేడుకలో నోట్ల వర్షం.. ఎగబడిన స్థానికులు..
ఓ పెళ్లి బారాత్ లో నోట్ల వర్షం కురిసింది. యూపీలోని సిద్దార్థ నగర్ లో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకల్లో వరుడి తరపు బంధువులు ఇండ్ల పై నిలబడి అక్కడి నుంచి అతిథులపై నోట్ల వర్షం కురిపించారు. రూ.100, 200, 500 నోట్లను వెదజల్లారు. దాదాపు రూ.20 లక్షల విలువైన నోట్లను వెదజల్లినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా నోట్ల వర్షం కురవడంతో వాటిని అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలా విసిరేసే బదులు అవసరమైన పేదవారికి పంచవచ్చు కదా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.., ‘ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారు’ అని మరొకరు సూచన చేశారు.