‘ఫేక్ ట్రేడింగ్ యాప్లతో జాగ్రత్త’..జీరోదా
ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జిరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తన సోషల్ మీడియాలో నకిలీ ట్రేడింగ్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. నకిలీవి త్వరగా పెట్టుబడి పెట్టాలని, సమయం మించిపోతోందని కస్టమర్లను భయపెడతాయి. అలాంటి వాటితో ఉన్నత చదువులు చదివినవారు కూడా మోసపోతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నకిలీ వాట్సాప్ గ్రూపులతో మాయమాటలతో బుట్టలో వేసుకుంటారని హెచ్చరించారు. ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బును వారి అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటారని పేర్కొన్నారు.
ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ఇలాంటి స్కామ్లు రోజురోజుకీ మరింత ఆధునికీకరణతో వస్తున్నాయని, వీటిని కనిపెట్టడం సవాలుగా మారిందని కామెంట్లు చేస్తున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో వాటిని మనం క్షుణ్ణంగా పరిశీలించలేకపోతున్నాం అని కొందరంటున్నారు.

