Andhra PradeshHome Page Slider

ఏపీలో వైఎస్సార్‌ బీమా నమోదు ప్రారంభం

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీలో వైఎస్సార్‌ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుం­బాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాద­వశాత్తు మరణిస్తే.. ఆ కుటుం­బాలకు ప్రభు­త్వం వైఎ­స్సార్‌ బీమా అందజేస్తోంది. గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమ­వ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు వివరా­లను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయా­లని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.­జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మర­ణిస్తే వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరి­హారంగా అందజేస్తారు. అలాగే 18–70 ఏళ్ల­లోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాద­వశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. బీమా కంపెనీలు, బ్యాం­కులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరి­హా­రం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది..