మద్యం మితంగా తీసుకుంటే మంచిదంటారుగా..!
మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే మద్యం బాటిళ్లపై ‘ఆరోగ్యానికి హానికరం’ అనే స్టిక్కర్ను అంటించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

స్టిక్కర్లు మద్యం బాటిళ్లపై హానికరం వేయించలేం..
‘ఆరోగ్యానికి హానికరం’ అనే స్టిక్కర్ను సిగరెట్ ప్యాకెట్లపై వేస్తున్నారని.. మద్యం బాటిళ్లపైనా అలాంటి స్టిక్కర్లు ముద్రించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించాలని కోరారు. ‘మద్యం ఆరోగ్యానికి హానికరం’ అని స్టిక్కర్లు అంటిస్తే యువత మేలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సిగరెట్ మాత్రం హానికరమే..
మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న వాళ్లు.. సిగరెట్ల విషయంలో అలా చెప్పలేదని చీఫ్ జస్టిస్ లలిత్ తెలిపారు. అయితే.. దీనిపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషనర్ వినతిని కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకే అనుమతి ఇస్తామని..లేకుంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసిం. దీంతో అడ్వకేట్ అశ్విని తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.