NewsTelangana

సీఎం ప్రసంగిస్తుంటే అలా చేస్తారా?

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ నగరమంతా కోలాహలం నెలకొంది. నగరంలోని రహదారులన్నీ భక్తులతో కిక్కిరిసాయి. అదే విధంగా మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఎంజీ మార్కెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గణేషుడి శోభా యాత్ర ప్రారంభమైన అనంతరం ఎంజీ మార్కెట్ వద్ద టీఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీ తొలగించాలని వివాదం చెలరేగింది. ఈ వివాదాన్ని అడ్డుకున్న పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించారు. దీంతో అది కాస్త సద్దుమనిగింది. ఇప్పుడు తాజాగా ఎంజీ మార్కెట్ వద్ద మరో వివాదం చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత ప్రసంగిస్తుండగా టీఆర్‌ఎస్ నేత ఆయన్ని అడ్డుకున్నారు. అసోం సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత మండిపడ్డారు. దీంతో అసోం సీఎం మాట్లాడుతుండగా టీర్‌ఎస్ నేత ఆయన మైక్‌ను పక్కకు లాగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీనిని గమనించిన పోలీసులు వెంటనే టీఆర్‌ఎస్ నేతను అక్కడి నుంచి పంపించివేశారు.