Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsSports

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం జాగ్రత్తగా ఉంచాలని ఆదేశించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆదేశాలు అందుకున్నట్లు వెల్లడించారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రజలు నదిని గానీ, కాలువలను గానీ దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వినిపించే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని సత్యప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.81 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. పరిస్థితి కారణంగా అధికారులు బ్యారేజ్ 69 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
విజయవాడ బెర్న్‌పార్క్ వద్ద టూరిజం సిబ్బంది అప్రమత్తమై పర్యాటక బోట్లను తాళ్లతో కట్టేశారు. లోతట్టు ప్రాంతాల్లో, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదే సమయంలో, అక్టోబర్ 2న జరగనున్న దుర్గమ్మ తెప్పోత్సవంపై కూడా వరద ప్రభావం పడే అవకాశం ఉంది. వరద ప్రవాహం కొనసాగితే, ఈ వేడుకను కేవలం నది ఒడ్డుకే పరిమితం చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలనే విజ్ఞప్తి చేయబడింది.