40 మంది మహిళలకు ఒకడే భర్త.. బీహార్లో విడ్డూరం
దేశంలోనే తొలిసారిగా బీహార్లో కుల గణన నిర్వహిస్తున్నారు. రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తి కాగా.. రెండో దశ ఏప్రిల్ 15న ప్రారంభం కాగా.. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి కులం, విద్య, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ స్థితిగతులను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 40 మంది మహిళలు తమ భర్త పేరుతోనే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

అధికారులకు విచిత్రమైన ఈ పరిస్థితి అర్వాల్ జిల్లాలో ఎదురైంది. అర్వాల్ పట్టణంలోని ఏడో వార్డు రెడ్లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. దాదాపు 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు తమ తండ్రి పేరు రూప్చంద్ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. అయితే అందరూ తన పేరు ఎందుకు చెబుతున్నారు అని ఆరా తీస్తే… అసలు విషయం బయటపడింది.

కుల గణన నమోదుకు వచ్చిన ఉపాధ్యాయుడు రాజీవ్ రంజన్ రాకేష్ మాట్లాడుతూ.. ఇక్కడ మహిళలు తమ భర్తలు, తండ్రులు, కొడుకులకు రూపచంద్ అని పేరు పెట్టారని తెలిపారు. అయితే రూప్చంద్ ఎవరనే సమాచారం సేకరించగా.. అది మనిషి కాదని, డబ్బును ‘రూప్చంద్’ అని అంటున్నారని నిర్ధారించాడు. మహిళలు, తమ భర్త పేరు రూప్చంద్ అని పెట్టుకోడానికి కారణం ఇదేనన్నాడు. అయితే ఆ ప్రాంతానికి చెందిన రూప్చంద్ అనే డ్యాన్సర్ కూడా ఉండేవాడు. ఎన్నో ఏళ్లుగా పాటలు పాడుతూ జీవించేవాడు. ఐతే, అతడికి స్థానికంగా ఇళ్లు కూడా లేదు. అయితే, ఆ మహిళలందరూ రూప్చంద్పై అభిమానంతో తన భర్త పేరుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో నివసించే వారికి కులం అనే బేధం లేదని అధికారులు చెబుతున్నారు.


