BusinessHome Page SliderInternational

30% కోడింగ్‌ ఏఐ రాస్తోంది :మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల

ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల కృత్రిమ మేధ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్‌ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌తో జరిపిన సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు. మంగళవారం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో నిర్వహించిన మెటా లామా ఏఐ డెవలపర్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాదెళ్ల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి మాట్లాడారు. కంపెనీకి సంబంధించి 20 నుంచి 30 శాతం కోడ్‌ను కృత్రిమ మేధతోనే రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. క్రమంగా వీటి వినియోగం అధికమవుతోందన్నారు. మెటా లామా మోడల్‌పై మాట్లాడిన జుకర్‌బర్గ్‌.. త్వరలో మరిన్ని ఏఐ మోడళ్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.ఇదిలాఉండగా.. గూగుల్‌ తన సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధ (AI)పై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఇప్పటికే వెల్లడించారు. జనరేట్‌ చేసిన కోడ్‌ను ఇంజినీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిందన్నారు. ఏఐ సాయంతో కోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా.. సమయాన్ని తగ్గించి, ఆవిష్కరణల విషయంలో వేగం పెంచడమే సంస్థ లక్ష్యమని వెల్లడించారు.