Home Page SliderNationalNews AlertPoliticsviral

ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లు బ్రేక్ డౌన్

రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ గురువారం రాత్రి రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే ఈ కాన్వాయ్ లో ఏకంగా 19 కార్లు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యాయి. కారణం తెలుసుకున్న సిబ్బంది ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. మార్గమధ్యంలో దోసిగావ్‌ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్‌ కొట్టించారు. ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. దీంతో గందరగోళం తలెత్తింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాల డీజిల్‌ (Diesel) ట్యాంక్‌లను తెరిచి చూడగా అందులో నీళ్లు ఉండటంతో వారంతా షాక్‌ అయ్యారు. డీజిల్‌లో నీళ్లు కలిపి ఏకంగా సీఎం కాన్వాయ్‌నే బురిడీ కొట్టించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.